
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
విమాన ల్యాండింగ్కు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఏటీసీ అధికారుల అనుమతి
అదే సమయంలో రన్వేపై టేకాఫ్కు సిద్దంగా మరో విమానం
పైలట్ అప్రమత్తతతో విమానాన్ని వెంటనే టేకాఫ్ చేసి, కొద్ది సేపు చక్కర్లు కొట్టించిన వైనం
ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన పైలట్ అప్రమత్తత కారణంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
గోవా నుంచి 150 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ లైన్స్ 6 ఈ 6973 విమాన సర్వీసు శంషాబాద్ మీదుగా విశాఖకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయడానికి ఏటీసీ అధికారులు అనుమతించడంతో పైలట్ విమానం హైడ్రాలిక్ గేర్ను సిద్ధం చేశాడు.
విమాన సర్వీసును డౌన్ చేసిన పైలట్.. అప్పటికే రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరో విమానాన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. వెంటనే తన విమానాన్ని టేకాఫ్ చేసి, పెను ప్రమాదం తప్పింది. పది నిమిషాల సేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు.
దీంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విమాన సర్వీస్ విశాఖకు వెళ్లిపోయింది. అయితే.. రన్ వేపై టేకాఫ్ తీసుకోవడానికి ఒక విమానం ఉండగా, మరో విమానం ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి ఇవ్వడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పడంతో అతన్ని అభినందిస్తున్నారు.